ఆధ్యాత్మిక శోభితం.. ఇందూరు తిరుమలం
ధ్వజారోహణతో కొలువుదీరిన వేడుకలు - రెండో రోజు శేష వాహనంపై గోవిందుడి విహారం
By R.Suresh
On
పాల్గొన్న శ్రీశ్రీశ్రీ దేవనాథ జీయర్ స్వామి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ రెడ్డి
ఇందూరు తిరుమల క్షేత్రం గోవింద నామస్మరణతో మారుమోగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు రెండో రోజు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం గరుడ ధ్వజారోహణతో దేవతలను ఆహ్వానించగా, సాయంత్రం శేష వాహనంపై స్వామి వారు భక్తులకు కనువిందు చేశారు. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో శ్రీశ్రీశ్రీ దేవనాథ జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ అహోబల జీయర్ స్వామి వారు పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణలు చేశారు.
భక్తిశ్రద్ధలతో ధ్వజారోహణ
బ్రహ్మోత్సవాల క్రతువులో భాగంగా సోమవారం ఉదయం అగ్ని మథనం ద్వారా అగ్నిదేవుడిని ఆహ్వానించి యాగశాల కార్యక్రమాలను ప్రారంభించారు. వైనతేయ ఇష్టి నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య గరుడ ధ్వజాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవనాథ జీయర్ స్వామి మాట్లాడుతూ.. "భగవంతుడిపై పరిపూర్ణ నమ్మకం ఉంటే తీరని కోరికలంటూ ఉండవు. భక్తుడికి, దేవుడికి మధ్య వారధి గరుత్మంతుడు" అని పేర్కొన్నారు. అనంతరం సంతానార్థులకు స్వామి వారి హస్తాల మీదుగా పవిత్ర 'గరుడ ప్రసాదాన్ని' పంపిణీ చేశారు.
శేష వాహనంపై స్వామి వారి ఊరేగింపు
సాయంత్రం వేళ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక పరిమళాలతో నిండిపోయింది. స్వామి వారు అత్యంత ప్రీతిపాత్రమైన శేష వాహనంపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, భజనల నడుమ సాగిన ఈ ఊరేగింపు భక్తులను పరవశింపజేసింది.
తరలివచ్చిన ప్రముఖులు
ఈ వేడుకల్లో ఆలయ ధర్మకర్తలు, ప్రముఖ సినీ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు ఆలయ ధర్మకర్తలు నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి, 'బలగం' చిత్ర నటుడు మధు తదితరులు పాల్గొన్నారు. యజ్ఞాచార్యులు శ్రీనివాసాచార్య, లక్ష్మణాచార్య, ప్రధాన అర్చకులు రోహిత్ కుమారాచార్య పర్యవేక్షణలో ధార్మిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి.
Views: 8
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

