అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా గుట్టురట్టు
34 కేసుల్లో 10 మంది నిందితుల అరెస్ట్..
By R.Suresh
On
క్వింటాన్నర రాగి తీగలు, నగదు స్వాధీనం
నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో గత కొంతకాలంగా ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగి తీగలను దొంగిలిస్తూ విద్యుత్ శాఖకు, రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును నిజామాబాద్ పోలీసులు రట్టు చేశారు. మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ పి.సాయి చైతన్య నిందితుల వివరాలను వెల్లడించారు. ఈ భారీ దొంగతనాలకు సంబంధించి మొత్తం 10 మందిని గుర్తించగా, అందులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. మిగిలిన ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిజామాబాద్కు చెందిన అఫ్జల్ ఖాన్, భైంసాకు చెందిన అర్బాజ్ ఖాన్, రెంజల్కు చెందిన సిద్దిక్ ఖాన్లతో పాటు మరికొందరు పాత నేరస్తులు జైలులో పరిచయమై ఒక ముఠాగా ఏర్పడ్డారు. గతంలో ఆవుల దొంగతనం, బైక్ చోరీ కేసుల్లో జైలుకు వెళ్లిన వీరు, అక్కడ కలిసిన అన్సార్, తాహెర్లతో కలిసి ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ కాయిల్స్ దొంగిలించాలని పథకం వేశారు. ప్రధానంగా గోదావరి నది పరివాహక ప్రాంతాలైన నవీపేట, నందిపేట, బోధన్, బాసర, ముధోల్, భైంసా మండలాల్లోని నిర్మానుష్య ప్రాంతాలను వీరు లక్ష్యంగా చేసుకున్నారు. పగలు బైక్లపై తిరుగుతూ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి, రాత్రి సమయంలో ఆటోలో వచ్చి అత్యంత చాకచక్యంగా రాగి తీగలను దొంగిలించేవారు.
దొంగిలించిన రాగిని నిజామాబాద్లోని ఏపీహెచ్బీ కాలనీలో ఒక గదిని అద్దెకు తీసుకుని అక్కడ భద్రపరిచేవారు. అనంతరం భైంసాకు చెందిన మహెబూబ్ ఖాన్ అనే ప్రధాన రిసీవర్కు కిలో రూ. 800 చొప్పున విక్రయించి, వచ్చిన సొమ్ముతో నిందితులు జల్సాలు చేసేవారు. పోలీసులు తమ సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను వలపన్ని పట్టుకున్నారు. వీరి నుంచి సుమారు 1.20 క్వింటాళ్ల రాగి తీగలు, రూ. 2.75 లక్షల నగదు, ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు మరియు దొంగతనానికి ఉపయోగించిన పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా అరెస్టుతో రెండు జిల్లాల్లోని 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 34 కేసులకు పరిష్కారం లభించిందని సీపీ తెలిపారు.
ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన ఏసీపీ ప్రకాష్ యాదవ్, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ శ్రీకాంత్ మరియు సిబ్బందిని కమీషనర్ ప్రత్యేకంగా అభినందించారు.
Views: 25
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

